ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి
వనపర్తి
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత ప్రణాళికా ప్రకారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ ఆదేశించారు. జూన్ నెలలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లతో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాష్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి వీసిలో పాల్గోన్నారు. సీఈఓ మాట్లాడుతూ తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను చేపడుతూ భారత ఎన్నికల కమిషన్ కీలక షెడ్యూల్ను విడుదల చేసిందన్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం, 2026 జూన్ 15 నుండి 24 వరకు బీ ఎల్ వో లకు, సంబంధిత సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అనంతరం, జూన్ 25 నుండి జూలై 24 వరకు నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో బీ ఎల్ వో లు ఇంటింటి సర్వే నిర్వహించి వివరాలను సేకరించడం జరుగుతుందన్నారు. సర్వే అనంతరం, జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే ఆగస్టు 30 వరకు స్వీకరించడం జరుగుతుందని, అభ్యంతరాల్ని సెప్టెంబర్ 28 వరకు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అన్ని అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించిన తర్వాత, చివరగా అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను (Final Voter List) అధికారికంగా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహణ విజయవంతం చేయాలన్నారు. జూన్ నెలలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నేపథ్యంలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తిచేయాలని ఆదేశించారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ షెడ్యూల్ తెలియజేయాలనీ సూచించారు. అదేవిధంగా, రాజకీయ పార్టీలు బిఎల్ఎ లను నియామకం చేసుకొని వారి జాబితా సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా, పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆదేశించారు. వీసీ అనంతరం జిల్లా అధికారులతో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత ప్రణాళికా ప్రకారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని నిర్వహించి, విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ ఐ ఆర్)కు సంబంధించి ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ను ప్రజలందరికి తెలియజేయాలన్నారు. ఇక ఎస్ ఐ ఆర్ లో భాగంగా నిర్వహిస్తున్న మాపింగ్ ప్రక్రియ వనపర్తి లో 79.81 శాతం పూర్తి అయిందని, ఇంకా వేగవంతం చేసి మాపింగ్ పూర్తి చేయాలన్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించి తమ ఓటరు వివరాలను సరిచేసుకోవాలని, అవసరమైన పత్రాలను అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ కోరారు. సమావేశం లో సి సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, డి సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, జిల్లా ఎన్నికల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
