ప్రజా పోరాటాలకు ఊపిరులూదిన ప్రజానాట్యమండలి : శ్రీనివాసులు
వనపర్తి
దేశ స్వాతంత్రం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలకు ప్రజా పోరాటాలకు ప్రజలను చైతన్యం చేసి ముందుకు నడిపించిన ఘన చరిత్ర ప్రజానాట్యమండలి సొంతమని తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రం సిపిఐ ఆఫీస్ వద్ద ప్రజానాట్యమండలి 4వ జిల్లా మహాసభ సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజానాట్యం మండలి జిల్లా అధ్యక్షుడు గోపాల అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. 1943లో ప్రజానాట్యమండలి ఏర్పడిందని దేశ స్వాతంత్రం కోసం ఆటపాటతో ప్రజల్లో స్వాతంత్ర ఆకాంక్షను రగిలించి, పోరాటాల్లోకి నడిపించిందన్నారు. ‘బాంచన్ నీ కాల్మొత్త దొర’అని పెట్టి చేసి జీవిస్తున్న తెలంగాణ ప్రజల విముక్తికి ఆటపాటతో ప్రజానాట్యమండలి ప్రజలను చైతన్యం చేసి నిజాం పాలనను కూల్చిందన్నారు. ఆనాడు కవులు కళాకారులు ఒక చేత పెన్ను ఒక చేత గన్ను పట్టుకొని పోరాడారన్నారు. తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమంలో ప్రజానాట్యమండలి కవులు కళాకారులు ఆటపాటలతో ప్రజల్లో చైతన్యం రగించారన్నారు. ధూమ్ దాం పేరుతో ఊరువాడ ప్రతిధ్వనించిందన్నారు. ప్రజల సమస్యలపై జరిగిన పోరాటాల్లోను ప్రజానాట్యమండలి కీలకపాత్ర పోషించింది అన్నారు. ఎర్రజెండా బిడ్డలుగా ప్రజానాట్యమండలిని ప్రజల కోసం బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. జిల్లాలో పార్టీ ఉన్న ప్రతి గ్రామంలో ప్రజానాట్యమండలి కళాకారులను తయారు చేయాలన్నారు. విద్యార్థులు యువతను ఆకర్షించేందుకు కళాశాలల్లో పాఠశాలలను పాటల పోటీలు కవితల పోటీలు పెట్టాలన్నారు. వారికి ప్రజా, విద్యార్థుల సమస్యలను వివరించి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఐదో మహాసభ నాటికి జిల్లా ప్రజానాట్యమండలిని బలోపేతం చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు వంకా గోపాల్, ప్రధాన కార్యదర్శి ఎర్రన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, సిపిఐ జిల్లా నాయకులు కళావతమ్మ, విజయుడు, శ్రీరామ్, రవీందర్, జయమ్మ, శ్యాంసుందర్, శిరీష, కుతుబు, వెంకటేష్, చందు, లక్ష్మీనారాయణ, ఇజ్రాయిల్, కుమార్, రూప తదితరులు పాల్గొన్నారు.
