వనపర్తి
ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం పెద్దమందడి మండల పరిధిలో పర్యటించిన అదనపు కలెక్టర్, జగత్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పౌర హక్కుల దినం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పౌర హక్కుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ కీలక సూచనలు చేశారు. ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకొని సమాజ అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు. అనంతరం ఆయన మణిగిల్ల, చిన్నమందడి, వెళ్టూర్, పెద్దమందడి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో ధాన్యం నిర్వహణపై ఆరా తీసి, రిజిస్టర్లు పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా మరియు వేగవంతంగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్రాల ఇన్చార్జ్లకు ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం స్వీకరణలో నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందిగా సూచించారు.అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ క్షేత్ర స్థాయిలో ఇంధన సరఫరా పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్తకోట మరియు వెల్టూరు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులను ఆయన తనిఖీ చేశారు. డి సి ఎస్ ఓ కాశీ విశ్వనాథ్, తహసీల్దార్ పాండు నాయక్, ఎంపీడీవో పరిణత, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.
