రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
వనపర్తి
పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొని 40 మంది రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారి సమన్వయంతో రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు డీడీలు చెల్లించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కోసం సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితికి పూర్తిగా ముగింపు పలికిందని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రస్తుతం రైతులు డీడీ చెల్లించిన రెండు నుంచి మూడు నెలల వ్యవధిలోనే ట్రాన్స్ఫార్మర్లు మంజూరవుతున్నాయని, మంజూరైన ట్రాన్స్ఫార్మర్లను పారదర్శకంగా రైతులకు అందజేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు సాగునీటి సౌకర్యాలు మెరుగుపడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ట్రాన్స్ఫార్మర్లు మంజూరైన ప్రతి రైతుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా వాటిని క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేయాలని, పనుల్లో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు నాణ్యమైన సేవలు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, పెబ్బేరు మండల అధ్యక్షులు యాపర్ల రాంరెడ్డి, పెబ్బేరు పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, సురేందర్ గౌడ్, రంజిత్ కుమార్, యుగేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు
