ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
వనపర్తి
గత 30 నెలల కాలంలో వనపర్తి నియోజకవర్గంలో రూ.2,147 కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేపట్టి అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 17వ విడత ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్), కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి తాను ప్రజల పెద్ద జీతగాడిలా పనిచేస్తున్నానని, గ్రామాలు–పట్టణాల సమగ్రాభివృద్ధితో పాటు ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, దివ్యాంగులు, పేద కుటుంబాల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనేక విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఆరోగ్య సేవల బలోపేతం, మహిళా సంఘాలకు చేయూత, ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమాలు వంటి పథకాలు ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్పై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఫోన్ ట్యాపింగ్ వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, సొంత చెల్లి ఫోన్ టాపింగ్ చేయడం లాంటి చర్యలు అత్యంత సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి, భూకబ్జాలు, అధికార దుర్వినియోగం పెరిగిపోవడంతో ప్రజలే ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించి ఇంటికి పంపించారని పేర్కొన్నారు.
దేశం కోసం, రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, రాష్ట్ర అభివృద్ధిలోనూ కాంగ్రెస్ పాత్ర చిరస్మరణీయమని చెప్పారు.. వనపర్తిలో గతంలో నియంతృత్వ ధోరణితో పాలన సాగిందని, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు సైతం సులభంగా కలిసే అవకాశం లేకుండా వ్యవహరించారని విమర్శించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధులనే ప్రజలు ఆదరిస్తారని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం తెలంగాణను భారీ అప్పులపాలు చేసిందని ఆరోపించిన ఎమ్మెల్యే, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పాటు సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని పురోగతి దిశగా నడిపిస్తోందన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వంటి మహనీయులను గౌరవించడం ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత అని పేర్కొన్నారు.అలాగే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసే విమర్శలకు ముందు తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఆధారరహిత వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు వారికి లేదన్నారు ఇప్పటివరకు 7,371 మంది లబ్ధిదారులకు రూ.18,05,65,900 మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో గతంలో 7,088 మందికి రూ.17,01,11,800 అందగా, తాజాగా 283 మందికి రూ.1,04,54,100 విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్: పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొంటూ, ఇప్పటివరకు 5,385 మంది లబ్ధిదారులకు రూ.53,91,24,660 మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో 5,038 మందికి రూ.50,43,84,408 అందగా, తాజాగా 347 మందికి రూ.3,47,40,252 చెక్కులు పంపిణీ చేసినట్లు వివరించారు. అభివృద్ధి–సంక్షేమం రెండింటినీ సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తూ వనపర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు యువకులు, మహిళలు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ కౌన్సిలర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు మాజీ మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పిటిసిలు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు సర్పంచులు మాజీ మాజీ సర్పంచ్లు లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
