ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
వనపర్తి
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించి ఫిర్యాదు దారునికి సమాచార ఇవ్వాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎన్ ఖీమ్య నాయక్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగ అదనపు కలెక్టర్ అధికారులకు సూచనలు ఇస్తూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి అట్టి సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదు దారునికి పంపించటమే కాకుండా ఆన్లైన్ లో పెట్టాలని ఆదేశించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేనిది అయితే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని తెలియజేశారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే పై అధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదు దారునికి తెలియజేయాలి తప్ప తమ వద్ద పెండింగ్ లో పెట్టుకోవద్దని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి నుంచి వచ్చిన ప్రజావాణి దరఖాస్తులను సైతం సత్వరం పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో 44 దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 11 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో జెడ్పి సీఈవో యాదయ్య, శిక్షణ ఉప కలెక్టర్లు మేడం శ్రావ్య, రజనీకాంత్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
