పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్ని వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కొత్తకోట, మదనాపూర్ మండలాల అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను వెంటనే గ్రౌండింగ్ చేయించి పనులు ప్రారంభించేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. లబ్ధిదారులు ప్రైవేట్ అప్పులపై ఆధారపడకుండా స్వయం సహాయక సంఘాల (SHGs) ద్వారా రుణాలు పొందేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మండలంలో ఇండ్లు మంజూరై ఇంకా ప్రారంభం కాని 58 ఇళ్లను, మదనాపూర్ మండలంలో ప్రారంభం కాని 28 ఇళ్లను తక్షణమే ప్రారంభించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. లబ్ధిదారులకు రుణాలు ఇప్పించి అయినా వెంటనే నిర్మాణాలు ప్రారంభించే విధంగా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి, రోజువారీ పురోగతిని పర్యవేక్షిస్తూ లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి అర్హులను వేగంగా గుర్తించి తమ లాగిన్ కు పంపాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. గుడిసెల్లో నివసించే వారే ప్రథమ ప్రాధాన్యతగా ఇండ్ల మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, హౌసింగ్ పీడీ విఠోబా, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మునిసిపల్ వైస్ చైర్పర్సన్ సునీత పల్లవి, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
