శాంతియుత వనపర్తి నిర్మాణానికి పోలీసు శాఖతో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి
జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి
వనపర్తి
జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టంగా కొనసాగించడం, ప్రజల సాధారణ జీవనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా చూడడం, అవాంఛనీయ సంఘటనలను ముందస్తుగా నివారించడం లక్ష్యంగా జులై 1 నుంచి జులై 31 వరకు “30 పోలీస్ యాక్ట్-1861” అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… జిల్లా పరిధిలో ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశమున్న ఎలాంటి కార్యక్రమమైనా సంబంధిత పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా నిర్వహించరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలు, భారీ స్థాయి సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను పోలీసులు ఏమాత్రం ఉపేక్షించబోరని, “30 పోలీస్ యాక్ట్” నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజల భద్రత, ప్రశాంతత మరియు సామాజిక శాంతిని పరిరక్షించడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఏ సంస్థ, సంఘం లేదా వ్యక్తి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించదలచినట్లయితే సంబంధిత పోలీసు అధికారులను ముందుగానే సంప్రదించి అనుమతి పొందాలని సూచించారు. చట్టాలను గౌరవించడం ప్రతి పౌరుని బాధ్యత అని, ప్రజల సహకారంతోనే జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని మరింత బలోపేతం చేయగలమని ఎస్పీ తెలిపారు. ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
