ప్రజలపై భారాలు మోపుతున్న మోడీ బలమైన ప్రధానా: సిపిఐ
వనపర్తి
ధరలు పెంచుతూ సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్న నరేంద్ర మోడీ బలమైన ప్రధాని ఎలా అవుతారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ ప్రశ్నించారు. బుధవారం రాత్రి జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతం అధ్యక్షతన వనపర్తి సిపిఐ ఆఫీసులో జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. దేశాన్ని పాలించిన గత ప్రధానులు 55 వేల లక్షల కోట్లు అప్పులు చేసి ఎన్నో ప్రాజెక్టులు, పరిశ్రమలు నిర్మించి ప్రజలకు ఉపాధి చూపించారన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో రెండు లక్షల 50 వేల లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఒక్క ప్రాజెక్టు పరిశ్రమ నిర్మించి యువతకు ప్రజలకు ఉపాధి కల్పించకపోగా, సామాన్యులపై పెట్రోలు డీజిల్ వంటగ్యాస్ వాణిజ సిలిండర్ల ధరలను పెంచారన్నారు. ఫలితంగా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులకు భారంగా మారాయి అన్నారు. 2014 ముందు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారని అంతర్జాతీయ మార్కెట్లో ఆనాడు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర108 డాలర్లు ఉండగా రూ. 65 కే లీటర్ పెట్రోల్ లభించింది అన్నారు. అయినప్పటికీఆనాడు బిజెపి ఆయనను బలహీనమైన ప్రధాని అని విమర్శించిందని, నేడు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 98 డాలర్లు ఉందని కానీ పెట్రోల్ ధర మాత్రం రూ. 118 కి పెంచారన్నారు. ప్రజలపై భారం మోపిన నరేంద్ర మోడీ బలమైన ప్రధాని ఎలా అవుతారని ప్రశ్నించారు. రష్యా చమురు తక్కువ ధరకు భారతదేశం కొంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొనవద్దని బెదిరిస్తే కొనటం లేదని, ఇతర దేశాల నుంచి ఎక్కువ ధరకు కొన్ని చమురు భారం ప్రజలపై మోపారని అలాంటప్పుడు మోదీ బలమైన ప్రధానిగా బిజెపి ప్రచారం చేయటం బూటకమన్నారు. దేశభక్తి, మత విశ్వాసాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేస్తున్నారని ప్రజలు గ్రహించి బిజెపికి బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని, రైతు భరోసా చెల్లించాలని, వరి మొక్కజొన్న పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లను రాజకీయాలకతీతంగా అర్హులకు ఇవ్వాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ కృష్ణవేణి గీత శ్రీరామ్ రమేష్ రాబర్ట్ మోష అబ్రహం కుతుబ్ గోపాల్ భరత్ నరసింహ శెట్టి తదితరులు పాల్గొన్నారు.
