వనపర్తి
అహింస, ఆత్మగౌరవం మరియు త్యాగనిరతికి ప్రతీకగా నిలిచిన పవిత్ర దేవతామూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత అని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కొనియాడారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వాసవి కన్యకా పరమేశ్వరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే తో పాటు అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ, అహింస, ఆత్మగౌరవం మరియు త్యాగనిరతికి ప్రతీకగా నిలిచిన పవిత్ర దేవతామూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత అని కొనియాడారు. వాసవి మాత సమాజానికి ధర్మం, అహింస, సత్యం వంటి గొప్ప విలువలను బోధించిన మహనీయురాలని అన్నారు. ఆమె చూపించిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సేవాభావం పెంపొందించుకోవాలని, వాసవి మాత బోధనలు అందరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, వాసవి మాత జయంతి వేడుకలు సమాజంలో సత్సంకల్పాలు పెంపొందించేలా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సుధీర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు