యువత ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
వనపర్తి
కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యువజన, క్రీడా వారోత్సవాల సందర్భంగా మే 1వ తేదీన మహబూబ్నగర్లో నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వనపర్తి జిల్లా నుంచి జాబ్ మేళాలో వివిధ ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన 17 మందికి ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన యువతకు కలెక్టర్, ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక క్రీడా, యువజన వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఫుట్బాల్, వాలీబాల్, హాకీ తదితర క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి క్రీడలు ఎంతో అవసరమని, ఫిట్నెస్ను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగంగా మార్చుకోవాలని అన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటకశాఖ కు సంబంధించిన బ్రాండింగ్ కిట్లను కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారూ
