వనపర్తి ప్రజా ప్రభుత్వం రైతులకు, మహిళలకు సమున్నత స్థానం కల్పిస్తోందని, సన్నారకం వరి ధాన్యానికి బోనస్ కల్పించి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి పేర్కొన్నారు. బుధవారం పార్లమెంటు సభ్యులు మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పెద్దమందడి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వీరు ఐకెపి ఆధ్వర్యంలో పెద్దమందడి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, వెల్టూరు గ్రామంలో ఏర్పాటుచేసిన రెండు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వడ్ల సంచిని తూకంపై పెట్టి కాంటా చేసి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రైతులకు, మహిళలకు సమున్నత స్థానం కల్పిస్తోందని, సన్నారకం వరి ధాన్యానికి బోనస్ కల్పించి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. వరి ధాన్యం అమ్మకానికి వచ్చిన రైతులకు తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి టాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. రైతులకు వారం రోజుల్లో నగదు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న రకం వరి ధాన్యానికి బోనస్ ఇచ్చి రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తోందని తెలిపారు. రైతులు ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.వెల్టూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన పలువురు లబ్ధిదారులకు ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేశారు. ఇల్లు లేని నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తూ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, మాజీ డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, డి ఆర్ డి ఓ ఉమాదేవి, డి సి ఎస్ ఓ కాశీ విశ్వనాధ్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.