బాలికల విద్యాభివృద్ధికి అందరూ తోడ్పడాలి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి
బాలికల విద్యను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు వారికి అండగా నిలబడి ఉన్నత చదువులకు తోడ్పాటు నివ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు.బాలికల విద్యాభివృద్ధి, ఉన్నత విద్యపై వారిలో మరింత ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో విలేజెస్ ఇన్ పార్ట్నర్షిప్ (VIP) గ్రామీణ భాగస్వామ్య సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర స్వామి ఆధ్వర్యంలో మంగళవారం వనపర్తిలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బాలికల విద్యను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థినులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం విద్యార్థుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ కవిత వంటి విజేతలను స్ఫూర్తిగా తీసుకుని మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలం నుంచి పదో తరగతిలో తెలుగు మాధ్యమంలో అత్యధిక మార్కులు సాధించిన 15 మంది విద్యార్థినులను సత్కరించారు. వారికి ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు, మొక్కలు అందజేశారు. అలాగే ప్రతిభ కనబరిచిన విద్యార్థినుల తల్లిదండ్రులు, సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులను కూడా ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా వి ఐ పి స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ఉన్నత చదివులు చదువుకుని తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన కవిత అనే అమ్మాయి ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రంజిత్ రెడ్డి, విలేజెస్ ఇన్ పార్ట్నర్షిప్ (VIP) వ్యవస్థాపకులు నాగేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు.
