అర్హులైన ప్రతి నిరుపేదకు విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
వనపర్తి
పేదవాడికి అండగా ఉంటారని, పేదల అభ్యున్నతికి అంకిత భావంతో పాటు పడతారని రాష్ట్ర ప్రజలు నమ్మి ఈ ప్రభుత్వాన్ని బలపరిచిందని, ప్రజల నమ్మకాన్ని తల తాకట్టు పెట్టీ అయిన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని, తద్వారా పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడమే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బుధవారం వనపర్తి జిల్లాలో పర్యటించి సహచర మంత్రులు రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను గుడిసెల్లో నివసించే పేద కుటుంబాలకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని, పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడమే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గుడిసెల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత గృహం కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తూ, రాష్ట్రంలో గృహరహితులు లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. వనపర్తి నియోజకవర్గానికి మరో రెండు వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని మంత్రికి కోరారు. అనంతరం మంత్రులు అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
