దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి
తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన దొడ్డి కొమురయ్య జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. శనివారం ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్ తో కలిసి హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతాంగ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. సామాజిక న్యాయం, ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్, సిపిఓ హరికృష్ణ, డి ఐ ఈ ఓ నరేంద్ర, డిడబ్ల్యు ఓ సుధారాణి, ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజా సంఘాల నేతలు, కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
