వనపర్తి
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు ఎంతగానో దోహదపడతాయని, అందుకే ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు టాలెంట్ ఫెస్ట్ నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వనపర్తి మర్రి కుంటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హాకీ మరియు క్రికెట్ సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ ఈరోజు నుండి ప్రారంభమై ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి కలెక్టర్ పాఠశాల వంటగదిని పరిశీలించారు. వంటగది పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలన్నారు. వంటగదిలో స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, మెస్ కమిటీకి చెందిన విద్యార్థులు రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నారా లేదా అన్న విషయంపై విచారణ చేశారు. అలాగే సంక్షేమ వారోత్సవాల భాగంగా పాఠశాలలో నిర్వహిస్తున్న క్విజ్, డ్రాయింగ్, వ్యాసరచన పోటీలను పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి, సరైన సమాధానాలు చెప్పిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రమేష్ రెడ్డి, ప్రిన్సిపల్ సరస్వతి, పాఠశాల సిబ్బంది, అధికారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు