సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్
వనపర్తి
సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులేనని, మానవాతీతులు కాదని నాస్తిక సమాజం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భాస్కర్ అన్నారు. ఆగస్టు 16న వనపర్తి బండారు నగర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘ భవనంలో జరగనున్న ఉమ్మడి జిల్లా ‘నాస్తిక అధ్యయన తరగతుల’ కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ.. శాస్త్రీయ సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. శాస్త్రీయ సమాజంతోనే వేగంగా దేశ ప్రగతి సాధ్యమన్నారు. నాస్తిక సమాజం దోపిడీ నుంచి కష్టజీవుల విముక్తి కోసం జరిగే కృషికి తోడుగా నిలుస్తుంది అన్నారు. ‘నాస్తికత్వం’ ఒక సంస్కృతిక ఉద్యమంగా, చైతన్య శక్తిగా ప్రజలను తీర్చిదిద్దుతుంది అన్నారు. హేతువాద నాస్తిక ఉద్యమాలు మూఢశాస్త్ర ప్రచారాలకు, దేవుని పేరిట జరిగే మోసాలకు వ్యతిరేకంగానే కాక .. మతం పేరుతో సాంఘిక ఆర్థిక వ్యత్యాసాలను పెంచి పోషించే వ్యక్తులు, వ్యవస్థ, వర్గాలకువ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి శాస్త్రీయ దృక్పథంగల సమాజం వైపు నడిపిస్తుందన్నారు. ఇందుకోసం ఆగస్టు 16 న వనపర్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘ భవనంలో ‘నాసిక అధ్యయన తరగతులు, జిల్లా నాస్తిక సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. విశ్రాంత ఆచార్యులు డాక్టర్ కె విజయ్ కుమార్ ‘గతి తార్కిక భౌతిక వాదం’తెలంగాణ విద్యావంతుల వేదిక బాధ్యులు అంబటి నాగయ్య ‘మతము -చరిత్ర’అంశాలపై ఉపన్యసిస్తారు అన్నారు. సభకు సిపిఐ జిల్లా నేత రమేష్ అధ్యక్షత వహిస్తారని, సిపిఐ జిల్లా నేత కే విజయరాములు, సిపిఎం జిల్లా నేత పుట్ట ఆంజనేయులు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నేత మైత్రి యాదయ్య సందేశాలు ఇస్తారన్నారు. ఏఐటీయూసీ జిల్లా నేత గోపాలకృష్ణ ఆహ్వానం పలకగా, ఎస్ భక్తరాజ్ ముగింపు పలుకుతారన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కరపత్రాల ఆవిష్కరణలో శ్రీరామ్, రమేష్ ,భక్తరాజ్, ప్రసాద్, శేఖర్, జనార్ధన్, గంధం నాగరాజు, వంశీ, బాలెమియా తదితరులు పాల్గొన్నారు.
