పోల్కంపల్లి శాంతాదేవికి పాకాల యశోద రెడ్డి పురస్కారం
వనపర్తి
తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో మహిళా సాహిత్య సాంస్కతిక సంస్థ, పాలమూరు వారి ఆధ్వర్యంలో ఆచార్య పాకాల యశోదా రెడ్డి 97వ జయంతి సందర్భంగా వారి రచనల సమగ్ర సాహిత్య సదస్సును రెండు ఆగస్టు 9 ,10వ తేదీలలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మహబూబ్ నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహితీ దిగ్గజం ఆచార్య పాకాల యశోదా రెడ్డి పురస్కారం -2026 గాను వనపర్తి వాస్తవ్యులు 7 దశాబ్దముల నుండి 65 నవలలు 100కు పైగా కథలు రాసిన ప్రసిధ్ధ నవలా కథా రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి గారికి ప్రకటించడం జరిగింది. శాంతా దేవి గారు అనారోగ్యం కారణంగా సభకు రాలేకపోయారు. అందుగురించి ఈ రోజు వారి స్వగృహంలో నవలా సామ్రాజ్ఞి పోల్కంపల్లి శాంతాదేవి గారికి ఆచార్య పాకాల యశోదా రెడ్డి సాహితీ పురస్కారం -2026 అందించారు. మెమెంటో శాలువాతో ఘనంగా సత్కరించి 5000 నగదు పురస్కారాన్ని సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రావూరి వనజ , జి. శాంతా రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు మంత సక్కుబాయి ఘాలి లలితా ప్రవల్లిక అందజేశారు . ఈ కార్యక్రమంలో పి. సుజాత, పి. సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఈ శుభ సందర్భంగా పోల్కంపల్లి శాంతా దేవి గారు మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు బిజినేపల్లి ముద్దుబిడ్డ డా. పాకాల యశోదా రెడ్డి గారు తెలంగాణ మాండలిక భాషను, ముఖ్యంగా పల్లె జీవన శైలిని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తన రచనల్లో సజీవంగా చిత్రించిన ప్రముఖ తెలుగు సాహితీవేత్త అని , ఆమె తెలంగాణ భాషకు ప్రత్యేక గౌరవాన్ని తీసుక వచ్చారని వారి సమగ్ర సాహిత్య సదస్సును నిర్వహించిన పాలమూరు మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమన్నారు. సంస్థ ఆహ్వానం మేరకు నేను పాలమూరు సభకు రాలేకపోయినా మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రావూరి వనజ శాంతా రెడ్డి తదితరులు వనపర్తి లోని మా స్వగృహానికి విచ్చేసి ఈ పురస్కారాన్ని అందించడం హర్షణీయమన్నారు.
