ఖాళీ ఉద్యోగ పోస్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
వనపర్తి
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై ప్రభుత్వం తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి.కుతుబ్ డిమాండ్ చేశారు.గురువారం అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి బదులు శాశ్వత నియామకాలు చేపట్టాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎం.డీ.కుతుబ్ మాట్లాడుతూ:-నీళ్లు నిధులు నియామకాల ఆకాంక్షల పునాదులపై పురుడు పోసుకున్న 12 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో నేటికీ నిరుద్యోగ యువత కలలు నీటి మీద రాతలు వలె మారాయని వాపోయారు. ప్రజాపాలన పేరుతా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన చిత్తశుద్ధితో ఉద్యోగుల భర్తీ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక వారి శక్తి యుక్తులు నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సహజ సంపద పుష్కలంగా ఉన్న పాలకుల చిత్తశుద్ధి లేని విధానాల ఫలితంగా నూతన పరిశ్రమల ఏర్పాటు ఉద్యోగుల కల్పన నిరుద్యోగ యువత యువకులకు అందని ద్రాక్షగా మారాయని వాపోయారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలు అరికట్టాలని ఫీజులో నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ:- రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ప్రకారం టిఎస్పిఎస్సి శాశ్వత జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత యువకులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకుంటూ నిరుద్యోగులను దగా చేస్తుందని అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని లేనిచో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ,ఏఐవైఎఫ్ నాయకులు ఎత్తు విష్ణు, ముస్తఫా,వినోద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
